Wednesday, November 17, 2010

దాపుడు కోక (కథ) -డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

"అయ్యో, నాయనా! నాకోక! దాపుడు కోక!"
పద్దెనిమిదేళ్ల పల్లెటూరు చెన్నమ్మ సీట్లోంచి దిగ్గున లేస్తూ అరిచింది.
వుట్టి పాటుగా ఆవేశంగా, ఆందోళనతో అరిచింది. చెన్నమ్మ అందమైంది కాదు. కాబట్టి దిగ్గున లేవడంలో హొయలు లేవు. వొళ్లో పైట మరుగున పాలు తాగుతున్న పసివాడు తల్లి వుట్టిపాటు కదిరిపడి కెవ్వుమన్నాడు. పైట జారిపోయింది. వీడిపోయిన రవికలోంచి, పసివాడి నోట్లోంచి తప్పిపోయిన రొమ్ములు కన్పిస్తున్నాయి. వొళ్లోంచి జారి పోతూ కెవ్వు మంటూన్న బిడ్డను సందిట్లోకి యెగదోసుకుంది.

* * * * *
నాయనా! నాకోక! దాపుడు కోక!
చెన్నమ్మ జాలిగా ఆర్తనాదం చేసింది. చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు. యేమరుస్తున్నదో సరిగా వినిపించకపోయినా, యెందుకరుస్తున్నదో అర్థం కాకపోయినా యేదో జరిగిందనుకున్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించుకొని ఆడవాళ్ల సీట్ల వైపు రావడానికి ఘోర ప్రయత్నం చేస్తున్నాడు వీరయ్య. తన చుట్టూ నిలబడి వున్నవాళ్ల తలల మధ్య నుంచీ నిక్కి చూస్తూ "యేంటమ్మా, యేంజరిగింది?" అన్నాడు. చెన్నమ్మకు వాళ్లనాయన ప్రశ్న వినిపించింది. నవ్వుతూన్న ప్రయాణీకులనూ, తనకేసి చూస్తున్న రసికులనూ చెన్నమ్మ చూసింది. యేడుపు దిగుమింగుకుంటూ అవమానభారంతో పైటలాక్కుంటూ అంది.

"మనం యింతకు ముందు దిగిన్నామే, ఆ బస్సులో నాగుడ్డల మూటె- దాపుడు కోకున్న మూటె మర్చిపోయినా"

టిక్కెట్లు వసూలు చేసుకుంటూ, బస్సులోని జనాన్ని సర్దుతూ ఆడవాళ్లనూ, మొరటువాళ్లనూ అదమాయిస్తూ అష్టావధానం చేస్తున్న కండక్టర్ చెన్నమ్మ అరుపులకు మండిపడ్డాడు. 'కూచో' అని కసిరాడు. అంతలో తంటాలు పడి అక్కడికి చీవాట్ల మధ్య వీరయ్య యీదుకుంటూ వచ్చాడు. గొర్రెపిల్లను రక్షించటానికి వచ్చిన గొర్లకాపరిలాగా, వీరయ్యకు సంగతి అర్థమైంది. కండక్టరును బస్సు ఆపమన్నాడు. కండక్టరు కస్సుమని వొంటికాలిమీద లేచాడు.
"యేందయ్యా మీ గోల. వూరిదాటి మైలొచ్చేసినాం, బస్సు నిలపడమేంది? ఆ మూటేదో తెచ్చుకునేదాకా బస్సాపమంటావా? నీ పుణ్యాన వెనక్కి పోనిమ్మంట్లేదు. నీకోసం బస్సు నిలబెట్టాల్నా? నువ్వేం డీయస్సీవా? బ్రేకినిస్పెక్టరువా?"
కండక్టరు నిజం పలికినందుకు వీరయ్య విస్తుపోయాడు. వీరయ్య డీయస్సీ కాదు. బ్రేకినిస్పెక్టరు అంతకన్నా కాదు. బస్సునూ, కండక్టరునూ చేసేదేం లేక కూతురును కసిరాడు.
"ఆమాత్రం జాగ్రత్త అఖ్కర్లా? ఆ మూటను యాడమర్చిపోయినావు? ఆ మాటెలో యేమున్నాయి?"
"మనూర్నుంచి వచ్చిన బస్సులో మర్చిపోయినా, అంత గుంపు దోసుకొస్తుంటే దిక్కుతెలీట్లేదు నాయనా? వూపిరాడక పిల్లోడు యేడ్చినాడు. తొందరగా దిగడంలో మర్చిపోయినా. దిగి మళ్లా ఆ బస్సులో యెదికితే దొరుకుతాదేమో?"
తండ్రి వైపూ, కండక్టరు వైపూ దీనాతిదీనంగా చూస్తూ, చుట్టూ వున్న వాళ్లను సిగ్గుతో చూస్తూ చెన్నమ్మసంజాయిషీ చెప్పింది.
"యే బస్సులో యేం?" కండక్టరు కరిచాడు.
"కడబ్బస్సులో" చెన్నమ్మ బెరుకుగా సమాధానమిచ్చింది.
"పెద్ద పెద్దయి మర్చిపోయినోళ్లతో కూడా మాకిబ్బంది లేదు. మీరు మా దుంపదెంచుతారు - నానా రకాల మూటల్తో వచ్చి."
తనేమిటో మర్చిపోయి కండక్టరు విసుక్కున్నాడు. కండక్టరు విసుక్కోకపోవడానికి చెన్నమ్మ ఖరీదైనది కాదు. సానుభూతితో పరామర్శించడానికి చెన్నమ్మ అందమైనది కాదు. మర్యాదగా మాట్టాడానికి చెన్నమ్మ బస్సు వోనర్లతో సంబంధముండే యే అధికారి భార్యా కాదు. బంధువూకాదు. బస్సులోని వారెవరో సానుభూతి ప్రకటించారు.

"పోనీలే పాపం, బస్సు నిలబెట్టు, వాళ్లు దిగుతారు. మూటె దొరుకుతుందేమో. అది నైటాల్టు బస్సేకదా? అక్కడే వుంటుంది."
వీరయ్య కొంత ధైర్యం తెచ్చుకొని బ్రతిమాలాడు.
"నీకు పుణ్ణెముంటుంది. మా టిక్కెట్టు డబ్బులు వెనక్కి యిచ్చి యిక్కడ దించు. మూటె దొరికితే యేరే బస్సులో వస్తాం."
"నీకేమన్నామతిబోయిందా? టికెట్టు రాసినాం. బస్సు వూరు దాటి రెండు మైళ్లొచ్చింది. యిప్పుడు టికెట్టు డబ్బులడుగుతావా? యింకా పొద్దుటూరు చేరినాకా అడగాలా? నీదేం బోయింది? యిట్లా అయితే మేమూ, మావోనరూ దివాలా తీయాల్సిందే." కండక్టరు స్వామి భక్తిని ప్రకటించాడు.
వీరయ్య ప్రాధేయ పడ్డాడు. "మళ్లా రావడానికి డబ్బుల్లేవు. నీకు పున్నెముంటుంది. ఇక్కడే దించి డబ్బులీ, దిగిపోతాం బాబ్బాబూ"
"డబ్బుల్లేవు డబ్బుల్లేవు యిదొక తంతయింది. నీకేం మా చెకింగు పట్టుకున్నాడంటే నా ఉద్యోగం వూడ్తుంది. డబ్బు వాపసేమీ రాదు. కావాలంటే దిగండి." కండక్టరు చీదరించాడు.
వీరయ్య కూతురు వైపు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. "దిగితే మళ్లా సార్జీలకు లేదు. పోతే పోనీలే మన కరమ."
"నా దగ్గర మూడు రూపాయలుంది. సార్జీలకు సరిపోతాది. దిగుదాం", చెన్నమ్మ కండక్టరు వైపు భయంతో చూస్తూ అంది.
కండక్టరు "దరిద్రపు రూటని" వదరుకుంటూ "హోల్డాన్" అని కేక వేశాడు. బస్సు ఆగింది. వీరయ్యా, చెమ్మన్నా దిగారు. చంకలోంచి జారిపోతున్న కొడుకును పైకి లాక్కుంటూ త్వరత్వరగా అడుగులు వేస్తూంది చెన్నమ్మ. వీరయ్య దిగులుగా అనుసరిస్తున్నాడు.
నాకోక
దాపుడు కోక
ముప్పయి రూపాయల కోక
పేటలో కొనుక్కున్న కోక
కలుపు తీయటానికి పోయి
నిమ్మసెట్లలో పాదులు తొవ్వటానికి పోయి
కట్టపడి డబ్బు కూడబెట్టుకుని
కొనుక్కున్న కోక
తనకెంతో ఇష్టమైన కోక
అరచేతి వెడల్పు నల్లంచు యెర్రకోక
మొగుడికి సానా యిష్టమైన కోక
యీ కోక కట్టుకుంటే సినిమాల్లో సావిత్రిలా వుంటావని మొగుడంటే
రోజూ కట్టుకోబుద్దయే కోక కానీ
వుతకలకు కట్టుకుంటే సిరిగి పోతుందని భయపడి
రోజూ కట్టుకోని కోక
పిల్లోడు పుట్నెప్పున్నించీ కట్టుకోని కోక
పిల్లోన్ని సంకలో యేసుకున్నప్పుడు వాడుచ్చలు పోస్తే పాడయిపోతాదని కట్టుకోని కోక
నలుగురూ మెచ్చుకున్న కోక
తన దాపుడు కోక
కరమ యెవడన్నా యెత్తకపోయినాడేమో!
పుట్టింట్లో అందరికీ సూపియ్యాలనుకున్నానే
తిరిగి వూరికి పోయినప్పుడు మొగుడేవంటాడోని
పుట్టింట్లో సెల్లెలికిచ్చి వచ్చినావని అరుస్తాడేమో!
ఆ కోకలేకపోతే
సినిమాలకు పోయేదెట్లా?
పండగలకెట్లా
రామేశ్వరం తిర్నాలకెట్లా?
పెండ్లిండ్లకెట్లా?
నలుగుర్లో తిరిగేదెట్లా?
మళ్లా కొత్తది కొనేదెట్లా?
ముప్పై రూపాయి కట్టం
సీరె కోసం కట్టంలో
నిమ్మ సెట్ల పాదులు తొలికెతో తొగీ తొగీ
సేతులు కాయలు కాసినాయి.
చెన్మమ్మ మనసు బాధతో నిండిపోయింది. దుఃఖం ముంచుకొచ్చింది. కళ్లల్లో నీళ్లు. కష్టం తెలిసిన కన్నీళ్లు. పేద కోరిక కారుస్తున్న కన్నీళ్లు.
"సామీ! యేడుకొండలవాడా! నా దాపుడు కోక దొరికితే వొక్క పొద్దుండి టెంకాయ కొడతా" అని చెన్నమ్మ మనసులో పరిపరివిధాల మొక్కుకుంది. వీరయ్యా, చెన్నమ్మ స్టాండు చేరారు.
"నాయనా! అదేబస్సు. మనం వూర్నించి వచ్చిన యెర్ర మూతి బస్సు." చెన్నమ్మకు కోక దొరికినంత ఆనందమయింది.
"పిల్లోంతో నువ్వేం బాధ పడతావు గాని, అదిగో అక్కడుండు. నేను యెదికి తెస్తా." వీరయ్య చెన్నమ్మను వో బంకు నీడలో వొక పక్కగా నిలబెట్టి బస్సు దగ్గరకు వెళ్లాడు. బస్సంతా వెతికాడు - సీటు సీటు పైనా కిందా - కన్పడలేదు. బస్సులో చెత్త వూడుస్తున్న కుర్రవాణ్ణి అడిగితే "అట్లాంటి మూటే కనపళ్లే"దన్నాడు. బస్సు దగ్గర వున్న వొకరిద్దర్ని అడిగినా ప్రయోజనం లేకపోయింది. డ్రైవరునూ, కండక్టరునూ అడుగుదామనుకున్నాడు. కానీ డ్రైవరు యింటికి పోయినాడట. కండక్టరు కలెక్షను డబ్బులు వోనరు కివ్వడానికి పోయినాడట - బస్సు క్లీనరు చెప్పాడు. వీరయ్య హతాశుడై తిరిగి వచ్చి కూతురును వోదార్చటానికి ప్రయత్నిస్తూ వేదాంతం చెప్పాడు.
"దొరకలా, యెంతెతికినా దొరకలా, యాడెతికినా దొరకలా, యెవర్నడిగినా దొరకలా, పొద్దున్నే యెవల్ల మొకం చూసి బయల్దేరినామో, మన కరమ, యేం సేస్తాం. యెవడో యెత్తకపోయినాడు. మనకంటే దరిద్దరం ముండా కొడుకు. అయినా మనలాంటోళ్లం జాగర్తగా వుండాల. యేందన్నా పోగొట్టుకుంటే తిరిగి సంపాయించుకునే గతి లేదు. పోతే పోనీలే వూరికి పోయినాక చూస్తాం"
బస్సులో పడిన అవమానాన్ని తలచుకుంటూ, నడిచి వచ్చిన శ్రమను అనుభవిస్తూ, మరొక చీర అట్లాంటి చీర - కొనలేం. దరిద్రాన్ని తలపోసుకుంటూ, అల్లుడేమనుకోకుండా అట్లాంటిదే మరొక చీరను కొని కూతురు కిచ్చే వుపాయాన్ని ఆలోచిస్తూ వీరయ్య కూతురును వోదారుస్తున్నాడు. అంతలో వాళ్లకు కొంచెం దూరంలో వొక తాగిన వాడు బండ బూతులు తిడుతూ తూలుకుంటూ పరుగెత్తుకొస్తున్నాడు. వాడి చేతిలో యేదో యెర్రటి బట్ట. వాని వెంట మరొకడు తరుముతూ వస్తున్నాడు.
"వొరే యెదవ నాకొడకా, యాడకు బోతావురా. గొంతుదాకా వుద్దర సారాయి తాగుదామను కున్నావా?"
సారాయి తాగిన వాడి చేతిలో వున్న వస్తువును లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సారాయి తాగిన వాడు గట్టిగా పట్టుకున్నా, కొంత సడలి బట్ట అంచులు జారినాయి.
"నాయనా! అదిగో అదే నాకోక, నాదే ఆకోక, అదే నా దాపుడు కోక."
చెన్నమ్మ తండ్రితో బిగ్గరగా చెప్పి వాళ్ల దగ్గరకు ఆదుర్దాతో పరుగెత్తుతోంది. వీరయ్య గాబరా పడుతూ వాళ్ల దగ్గరకు చేరాడు. వాళ్లింకా పెనుగులాడుతూనే వున్నారు. సారాయి తాగిన వానితో పెనుగులాడుతున్న వాడంటున్నాడు.
"రేయి నాదగ్గర టోకరా యేస్తావా? తాకట్టు పెట్టినట్టు పెట్టి పనికి రానివన్నీ నామీదేసి యీ కోక లాక్కొని పోతావా - నదురుగా వుందని. తాగిన పద్దరాములు సారాయైనా కక్కు, లేదా యీకోక నాకివ్వు. తోత యీరా దొంగ నాకొడకా"
"నాకోక, నాదే దాపుడు కోక మిగతా పిల్లోడి గుడ్డలూ అయ్యి యాడ్నో?" చెన్నమ్మ దీనంగా గొణుగుతోంది.
వీరయ్య వాళ్ల దగ్గరకు భయం భయంగా వెళ్లి అన్నాడు.
"యీ కోక మాయమ్మిది. బస్సులో మరిసిపోయింది."
"అదే నేననుకుంటాండ, యా నాకొడుక్కు కోకెక్కడిదీ అని, బస్సులో కొట్టేసినాడన్నమాట! వొరేయి యిడవరా కోక."
సారాయి తాగిన వాడు నంగి నంగిగా అన్నాడు "ర్రేయి నాసంగతి తెలీదా. యిడు. యిది నా కోక. నా పెండ్లాందిరా."
యిద్దరూ గట్టిగా పెనుగులాడుతున్నారు. అరుపులు, తిట్లతో. వీరయ్య చీరను విడిపించడానికి తానూ ప్రయత్నించాడు. పెనుగులాటలో చీర పర్రున చిరిగింది. చెన్నమ్మ యెర్రకోక, నల్లంచు యెర్ర దాపుడు కోక చిరిగి పీలికలైంది. లభస యింకా ఎక్కువైంది. వాళ్లు కొట్టుకుంటున్నారు. వీరయ్య చిరిగిన చీర వంక నిశ్చేష్ఠుడై చూస్తున్నాడు.
చెన్నమ్మ కలలకూ, ఆశలకూ, ప్రేమకూ, గర్వానికీ, ఆనందానికీ నిలయమైన దాపుడు కోకను, చెన్నమ్మ గుండెకు ప్రతిరూపమైన యెర్ర కోకను వాళ్లది కాని చెన్నమ్మకోకను వాళ్లు నిర్దాక్షిణ్యంగా చించి పారవేశారు. చెన్నమ్మ దాపుడు కోక పీలికలైంది.
"నా  చెన్నమ్మ కిందపడిన పీలికల్ని పట్టుకొని రోదిస్తోంది. చంకలో పసివాడు అమ్మ వెక్కిళ్లకు శృతి పెడుతున్నాడు.

Tuesday, November 16, 2010

బ్రౌన్ ఆశయాలకు అంకితమవ్వాలి - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

 ప్రసంగిస్తున్న డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు
సీపీ బ్రౌన్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే విధంగా ఆయన జయంతి రోజున అంకితమవ్వాలని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో యోగి వేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి అధ్యక్షతన సీపీ బ్రౌన్ 212 జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కేతు విశ్వనాథరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రౌన్ 1992లో కలెక్టర్ అసిస్టెంట్‌గా ఉంటూ కడపలోని కరువు, సాంస్కృతిక స్థితిగతులను వివరిస్తూ లండన్‌కు లేఖలు రాశారన్నారు.
 యోగి వేమన యూనివర్శిటీ వీసీ అర్జుల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బ్రౌన్ తెలుగుభాష, తెలుగుజాతికి ఎనలేని సేవ చేసిన మహానీయుడని కొనియాడారు. వైవీయూలో పరిశోధనలకు అనుగుణంగా మరో బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని సిటీ క్యాంపస్‌గా, యూనివర్శిటీలో ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రాన్ని యూనివర్శిటీ క్యాంపస్‌గా ఉంచుతామన్నారు. యూనివర్శిటీ పరిశోధన కేంద్రంలో తెలుగు, హిస్టరీ, లలితకళల విభాగం, జర్నలిజం అనుసంధానం అవుతాయని తెలిపారు. సీపీ బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో మ్యూజియంను ఏర్పాటు చేసి అరుదైన పుస్తకాలు ఉంచుతామన్నారు. జిల్లా చరిత్ర, సాంస్కృతిక, సాహితీ, రాజకీయ చరిత్రలను తరతరాలకు తెలియజేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
 జానమద్ది హనుమచ్ఛాస్తి మాట్లాడుతూ సీపీ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో సంగ్రహ నివేదికను రిజిస్ట్రార్, పాలక మండల సభ్యుడు, ఆచార్య సి.శివరామిరెడ్డి సమర్పించారు. అనుసంధానకర్తగా వైవీయూ రీసెర్చి అసిస్టెంట్ కట్టా నరసింహులు వ్యవహరించారు. సీపీ బ్రౌన్ గీతాన్ని వై.మధుసూదన్ ఆలపించారు. బ్రౌన్ సైకత ముఖ చిత్రాన్ని ముద్దనూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, ఉపాధ్యాయుడు జార్జిలు తీసుకురాగా, సభలో ఆవిష్కరించారు. డాక్టర్ కృష్ణారెడ్డి తమ్ముని కుమారుడు సునీల్‌కుమార్‌రెడ్డి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్ర్తిని సన్మానించి రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందించారు. వేమన నీతి - లోకరీతి అనే పేరుతో వేమన పద్యాలు ఉన్న ఆడియో సీడీలను చిలకలూరిపేటకు చెందిన ఎస్ మహేష్ సభికులకు బహూకరించారు. వేమన సాహిత్యంతోపాటు పద్యాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు.
లోపాలు చూపేవాడే సద్విమర్శకుడు
మంచి విమర్శకుడైనవాడు భజనపరుడు కాదు.. వస్తు విశ్లేషణ కర్త కాదు.. లక్ష్యాన్ని పరిచయం చేసేవాడు, లోపాలను చూపేవాడే సద్విమర్శకుడు అని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. బ్రౌన్ జయంతి ఉత్సవాలలో భాగంగా జానమద్ది హనుమచ్ఛాస్ర్తి ఆవిష్కరించిన మన నవలలు-మన కథానికలు అనే పుస్తకాన్ని ఆయన సమీక్షించారు. కథా రచయిత ఆచార్య రాచపాలెం రామచంద్రారెడ్డి 13 నవలలను పరిచయం చేశారన్నారు. ఆయన ఆధునిక సాహిత్య విమర్శకుల్లో నిష్ణాతుడని కొనియాడారు. వైవీయూ వీసీ అర్జుల రామచంద్రారెడ్డి సతీమణి వరలక్షుమ్మ ఈ పుస్తకాన్ని స్వీకరించారు. తెలుగుభాష కోసం జీవితం సమర్పించిన బ్రౌన్ అనే పుస్తకాన్ని శశిశ్రీ రాయగా, రిజిస్ట్రార్ శివరామిరెడ్డి ఆవిష్కరించారు.
 భాషా పరిశోధన వ్యవహార కర్తగా ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో భాషా పరిశోధన వ్యవహారకర్తగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని నియమించినట్లు యోగి వేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అర్జుల రామచంద్రారెడ్డి తెలిపారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో బుధవారం నిర్వహించిన సాహితీ కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. భాషా పరిశోధనలు అంతంత మాత్రంగానే సాగుతున్నందున భాషపై మంచి పట్టు ఉన్న ప్రసిద్ధ కథకుడు, విమర్శకుడు అయిన కేతు విశ్వనాథరెడ్డిని వ్యవహార కర్తగా నియమిస్తూ యూనివర్శిటీ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.
 ఆయన నియామకంతో భాషా పరిశోధనలు ఆశాజనకంగా ఉంటాయని కమిటీ భావించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ భాషా పరిశోధనకు వైస్ ఛాన్సలర్ రామచంద్రారెడ్డి, సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్ర్తి సలహాలతో అవిరళ కృషి చేస్తానన్నారు. బ్రౌన్ చరిత్ర, నిర్మాణం, నిఘంటువు, చంధస్సు, వ్యాకరణం, భాషకు చేసిన కృషితోపాటు జిల్లా వస్తు చరిత్ర, అదనపు చరిత్ర, ముస్లిం రచనలు ఆనాటి రచనల ఆధారంగా సమగ్ర విషయాన్ని సేకరించి పరిశోధనలు చేసి తెలుగుభాషకు గుర్తింపు తెస్తానన్నారు. చరిత్ర, లలిత కళలు, జర్నలిజం ఆధారంగా, రాజకీయ, సాంస్కృతిక పరంగా జిల్లా సమగ్ర చరిత్ర నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.