Wednesday, November 17, 2010

దాపుడు కోక (కథ) -డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

"అయ్యో, నాయనా! నాకోక! దాపుడు కోక!"
పద్దెనిమిదేళ్ల పల్లెటూరు చెన్నమ్మ సీట్లోంచి దిగ్గున లేస్తూ అరిచింది.
వుట్టి పాటుగా ఆవేశంగా, ఆందోళనతో అరిచింది. చెన్నమ్మ అందమైంది కాదు. కాబట్టి దిగ్గున లేవడంలో హొయలు లేవు. వొళ్లో పైట మరుగున పాలు తాగుతున్న పసివాడు తల్లి వుట్టిపాటు కదిరిపడి కెవ్వుమన్నాడు. పైట జారిపోయింది. వీడిపోయిన రవికలోంచి, పసివాడి నోట్లోంచి తప్పిపోయిన రొమ్ములు కన్పిస్తున్నాయి. వొళ్లోంచి జారి పోతూ కెవ్వు మంటూన్న బిడ్డను సందిట్లోకి యెగదోసుకుంది.

* * * * *
నాయనా! నాకోక! దాపుడు కోక!
చెన్నమ్మ జాలిగా ఆర్తనాదం చేసింది. చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు. యేమరుస్తున్నదో సరిగా వినిపించకపోయినా, యెందుకరుస్తున్నదో అర్థం కాకపోయినా యేదో జరిగిందనుకున్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించుకొని ఆడవాళ్ల సీట్ల వైపు రావడానికి ఘోర ప్రయత్నం చేస్తున్నాడు వీరయ్య. తన చుట్టూ నిలబడి వున్నవాళ్ల తలల మధ్య నుంచీ నిక్కి చూస్తూ "యేంటమ్మా, యేంజరిగింది?" అన్నాడు. చెన్నమ్మకు వాళ్లనాయన ప్రశ్న వినిపించింది. నవ్వుతూన్న ప్రయాణీకులనూ, తనకేసి చూస్తున్న రసికులనూ చెన్నమ్మ చూసింది. యేడుపు దిగుమింగుకుంటూ అవమానభారంతో పైటలాక్కుంటూ అంది.

"మనం యింతకు ముందు దిగిన్నామే, ఆ బస్సులో నాగుడ్డల మూటె- దాపుడు కోకున్న మూటె మర్చిపోయినా"

టిక్కెట్లు వసూలు చేసుకుంటూ, బస్సులోని జనాన్ని సర్దుతూ ఆడవాళ్లనూ, మొరటువాళ్లనూ అదమాయిస్తూ అష్టావధానం చేస్తున్న కండక్టర్ చెన్నమ్మ అరుపులకు మండిపడ్డాడు. 'కూచో' అని కసిరాడు. అంతలో తంటాలు పడి అక్కడికి చీవాట్ల మధ్య వీరయ్య యీదుకుంటూ వచ్చాడు. గొర్రెపిల్లను రక్షించటానికి వచ్చిన గొర్లకాపరిలాగా, వీరయ్యకు సంగతి అర్థమైంది. కండక్టరును బస్సు ఆపమన్నాడు. కండక్టరు కస్సుమని వొంటికాలిమీద లేచాడు.
"యేందయ్యా మీ గోల. వూరిదాటి మైలొచ్చేసినాం, బస్సు నిలపడమేంది? ఆ మూటేదో తెచ్చుకునేదాకా బస్సాపమంటావా? నీ పుణ్యాన వెనక్కి పోనిమ్మంట్లేదు. నీకోసం బస్సు నిలబెట్టాల్నా? నువ్వేం డీయస్సీవా? బ్రేకినిస్పెక్టరువా?"
కండక్టరు నిజం పలికినందుకు వీరయ్య విస్తుపోయాడు. వీరయ్య డీయస్సీ కాదు. బ్రేకినిస్పెక్టరు అంతకన్నా కాదు. బస్సునూ, కండక్టరునూ చేసేదేం లేక కూతురును కసిరాడు.
"ఆమాత్రం జాగ్రత్త అఖ్కర్లా? ఆ మూటను యాడమర్చిపోయినావు? ఆ మాటెలో యేమున్నాయి?"
"మనూర్నుంచి వచ్చిన బస్సులో మర్చిపోయినా, అంత గుంపు దోసుకొస్తుంటే దిక్కుతెలీట్లేదు నాయనా? వూపిరాడక పిల్లోడు యేడ్చినాడు. తొందరగా దిగడంలో మర్చిపోయినా. దిగి మళ్లా ఆ బస్సులో యెదికితే దొరుకుతాదేమో?"
తండ్రి వైపూ, కండక్టరు వైపూ దీనాతిదీనంగా చూస్తూ, చుట్టూ వున్న వాళ్లను సిగ్గుతో చూస్తూ చెన్నమ్మసంజాయిషీ చెప్పింది.
"యే బస్సులో యేం?" కండక్టరు కరిచాడు.
"కడబ్బస్సులో" చెన్నమ్మ బెరుకుగా సమాధానమిచ్చింది.
"పెద్ద పెద్దయి మర్చిపోయినోళ్లతో కూడా మాకిబ్బంది లేదు. మీరు మా దుంపదెంచుతారు - నానా రకాల మూటల్తో వచ్చి."
తనేమిటో మర్చిపోయి కండక్టరు విసుక్కున్నాడు. కండక్టరు విసుక్కోకపోవడానికి చెన్నమ్మ ఖరీదైనది కాదు. సానుభూతితో పరామర్శించడానికి చెన్నమ్మ అందమైనది కాదు. మర్యాదగా మాట్టాడానికి చెన్నమ్మ బస్సు వోనర్లతో సంబంధముండే యే అధికారి భార్యా కాదు. బంధువూకాదు. బస్సులోని వారెవరో సానుభూతి ప్రకటించారు.

"పోనీలే పాపం, బస్సు నిలబెట్టు, వాళ్లు దిగుతారు. మూటె దొరుకుతుందేమో. అది నైటాల్టు బస్సేకదా? అక్కడే వుంటుంది."
వీరయ్య కొంత ధైర్యం తెచ్చుకొని బ్రతిమాలాడు.
"నీకు పుణ్ణెముంటుంది. మా టిక్కెట్టు డబ్బులు వెనక్కి యిచ్చి యిక్కడ దించు. మూటె దొరికితే యేరే బస్సులో వస్తాం."
"నీకేమన్నామతిబోయిందా? టికెట్టు రాసినాం. బస్సు వూరు దాటి రెండు మైళ్లొచ్చింది. యిప్పుడు టికెట్టు డబ్బులడుగుతావా? యింకా పొద్దుటూరు చేరినాకా అడగాలా? నీదేం బోయింది? యిట్లా అయితే మేమూ, మావోనరూ దివాలా తీయాల్సిందే." కండక్టరు స్వామి భక్తిని ప్రకటించాడు.
వీరయ్య ప్రాధేయ పడ్డాడు. "మళ్లా రావడానికి డబ్బుల్లేవు. నీకు పున్నెముంటుంది. ఇక్కడే దించి డబ్బులీ, దిగిపోతాం బాబ్బాబూ"
"డబ్బుల్లేవు డబ్బుల్లేవు యిదొక తంతయింది. నీకేం మా చెకింగు పట్టుకున్నాడంటే నా ఉద్యోగం వూడ్తుంది. డబ్బు వాపసేమీ రాదు. కావాలంటే దిగండి." కండక్టరు చీదరించాడు.
వీరయ్య కూతురు వైపు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. "దిగితే మళ్లా సార్జీలకు లేదు. పోతే పోనీలే మన కరమ."
"నా దగ్గర మూడు రూపాయలుంది. సార్జీలకు సరిపోతాది. దిగుదాం", చెన్నమ్మ కండక్టరు వైపు భయంతో చూస్తూ అంది.
కండక్టరు "దరిద్రపు రూటని" వదరుకుంటూ "హోల్డాన్" అని కేక వేశాడు. బస్సు ఆగింది. వీరయ్యా, చెమ్మన్నా దిగారు. చంకలోంచి జారిపోతున్న కొడుకును పైకి లాక్కుంటూ త్వరత్వరగా అడుగులు వేస్తూంది చెన్నమ్మ. వీరయ్య దిగులుగా అనుసరిస్తున్నాడు.
నాకోక
దాపుడు కోక
ముప్పయి రూపాయల కోక
పేటలో కొనుక్కున్న కోక
కలుపు తీయటానికి పోయి
నిమ్మసెట్లలో పాదులు తొవ్వటానికి పోయి
కట్టపడి డబ్బు కూడబెట్టుకుని
కొనుక్కున్న కోక
తనకెంతో ఇష్టమైన కోక
అరచేతి వెడల్పు నల్లంచు యెర్రకోక
మొగుడికి సానా యిష్టమైన కోక
యీ కోక కట్టుకుంటే సినిమాల్లో సావిత్రిలా వుంటావని మొగుడంటే
రోజూ కట్టుకోబుద్దయే కోక కానీ
వుతకలకు కట్టుకుంటే సిరిగి పోతుందని భయపడి
రోజూ కట్టుకోని కోక
పిల్లోడు పుట్నెప్పున్నించీ కట్టుకోని కోక
పిల్లోన్ని సంకలో యేసుకున్నప్పుడు వాడుచ్చలు పోస్తే పాడయిపోతాదని కట్టుకోని కోక
నలుగురూ మెచ్చుకున్న కోక
తన దాపుడు కోక
కరమ యెవడన్నా యెత్తకపోయినాడేమో!
పుట్టింట్లో అందరికీ సూపియ్యాలనుకున్నానే
తిరిగి వూరికి పోయినప్పుడు మొగుడేవంటాడోని
పుట్టింట్లో సెల్లెలికిచ్చి వచ్చినావని అరుస్తాడేమో!
ఆ కోకలేకపోతే
సినిమాలకు పోయేదెట్లా?
పండగలకెట్లా
రామేశ్వరం తిర్నాలకెట్లా?
పెండ్లిండ్లకెట్లా?
నలుగుర్లో తిరిగేదెట్లా?
మళ్లా కొత్తది కొనేదెట్లా?
ముప్పై రూపాయి కట్టం
సీరె కోసం కట్టంలో
నిమ్మ సెట్ల పాదులు తొలికెతో తొగీ తొగీ
సేతులు కాయలు కాసినాయి.
చెన్మమ్మ మనసు బాధతో నిండిపోయింది. దుఃఖం ముంచుకొచ్చింది. కళ్లల్లో నీళ్లు. కష్టం తెలిసిన కన్నీళ్లు. పేద కోరిక కారుస్తున్న కన్నీళ్లు.
"సామీ! యేడుకొండలవాడా! నా దాపుడు కోక దొరికితే వొక్క పొద్దుండి టెంకాయ కొడతా" అని చెన్నమ్మ మనసులో పరిపరివిధాల మొక్కుకుంది. వీరయ్యా, చెన్నమ్మ స్టాండు చేరారు.
"నాయనా! అదేబస్సు. మనం వూర్నించి వచ్చిన యెర్ర మూతి బస్సు." చెన్నమ్మకు కోక దొరికినంత ఆనందమయింది.
"పిల్లోంతో నువ్వేం బాధ పడతావు గాని, అదిగో అక్కడుండు. నేను యెదికి తెస్తా." వీరయ్య చెన్నమ్మను వో బంకు నీడలో వొక పక్కగా నిలబెట్టి బస్సు దగ్గరకు వెళ్లాడు. బస్సంతా వెతికాడు - సీటు సీటు పైనా కిందా - కన్పడలేదు. బస్సులో చెత్త వూడుస్తున్న కుర్రవాణ్ణి అడిగితే "అట్లాంటి మూటే కనపళ్లే"దన్నాడు. బస్సు దగ్గర వున్న వొకరిద్దర్ని అడిగినా ప్రయోజనం లేకపోయింది. డ్రైవరునూ, కండక్టరునూ అడుగుదామనుకున్నాడు. కానీ డ్రైవరు యింటికి పోయినాడట. కండక్టరు కలెక్షను డబ్బులు వోనరు కివ్వడానికి పోయినాడట - బస్సు క్లీనరు చెప్పాడు. వీరయ్య హతాశుడై తిరిగి వచ్చి కూతురును వోదార్చటానికి ప్రయత్నిస్తూ వేదాంతం చెప్పాడు.
"దొరకలా, యెంతెతికినా దొరకలా, యాడెతికినా దొరకలా, యెవర్నడిగినా దొరకలా, పొద్దున్నే యెవల్ల మొకం చూసి బయల్దేరినామో, మన కరమ, యేం సేస్తాం. యెవడో యెత్తకపోయినాడు. మనకంటే దరిద్దరం ముండా కొడుకు. అయినా మనలాంటోళ్లం జాగర్తగా వుండాల. యేందన్నా పోగొట్టుకుంటే తిరిగి సంపాయించుకునే గతి లేదు. పోతే పోనీలే వూరికి పోయినాక చూస్తాం"
బస్సులో పడిన అవమానాన్ని తలచుకుంటూ, నడిచి వచ్చిన శ్రమను అనుభవిస్తూ, మరొక చీర అట్లాంటి చీర - కొనలేం. దరిద్రాన్ని తలపోసుకుంటూ, అల్లుడేమనుకోకుండా అట్లాంటిదే మరొక చీరను కొని కూతురు కిచ్చే వుపాయాన్ని ఆలోచిస్తూ వీరయ్య కూతురును వోదారుస్తున్నాడు. అంతలో వాళ్లకు కొంచెం దూరంలో వొక తాగిన వాడు బండ బూతులు తిడుతూ తూలుకుంటూ పరుగెత్తుకొస్తున్నాడు. వాడి చేతిలో యేదో యెర్రటి బట్ట. వాని వెంట మరొకడు తరుముతూ వస్తున్నాడు.
"వొరే యెదవ నాకొడకా, యాడకు బోతావురా. గొంతుదాకా వుద్దర సారాయి తాగుదామను కున్నావా?"
సారాయి తాగిన వాడి చేతిలో వున్న వస్తువును లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సారాయి తాగిన వాడు గట్టిగా పట్టుకున్నా, కొంత సడలి బట్ట అంచులు జారినాయి.
"నాయనా! అదిగో అదే నాకోక, నాదే ఆకోక, అదే నా దాపుడు కోక."
చెన్నమ్మ తండ్రితో బిగ్గరగా చెప్పి వాళ్ల దగ్గరకు ఆదుర్దాతో పరుగెత్తుతోంది. వీరయ్య గాబరా పడుతూ వాళ్ల దగ్గరకు చేరాడు. వాళ్లింకా పెనుగులాడుతూనే వున్నారు. సారాయి తాగిన వానితో పెనుగులాడుతున్న వాడంటున్నాడు.
"రేయి నాదగ్గర టోకరా యేస్తావా? తాకట్టు పెట్టినట్టు పెట్టి పనికి రానివన్నీ నామీదేసి యీ కోక లాక్కొని పోతావా - నదురుగా వుందని. తాగిన పద్దరాములు సారాయైనా కక్కు, లేదా యీకోక నాకివ్వు. తోత యీరా దొంగ నాకొడకా"
"నాకోక, నాదే దాపుడు కోక మిగతా పిల్లోడి గుడ్డలూ అయ్యి యాడ్నో?" చెన్నమ్మ దీనంగా గొణుగుతోంది.
వీరయ్య వాళ్ల దగ్గరకు భయం భయంగా వెళ్లి అన్నాడు.
"యీ కోక మాయమ్మిది. బస్సులో మరిసిపోయింది."
"అదే నేననుకుంటాండ, యా నాకొడుక్కు కోకెక్కడిదీ అని, బస్సులో కొట్టేసినాడన్నమాట! వొరేయి యిడవరా కోక."
సారాయి తాగిన వాడు నంగి నంగిగా అన్నాడు "ర్రేయి నాసంగతి తెలీదా. యిడు. యిది నా కోక. నా పెండ్లాందిరా."
యిద్దరూ గట్టిగా పెనుగులాడుతున్నారు. అరుపులు, తిట్లతో. వీరయ్య చీరను విడిపించడానికి తానూ ప్రయత్నించాడు. పెనుగులాటలో చీర పర్రున చిరిగింది. చెన్నమ్మ యెర్రకోక, నల్లంచు యెర్ర దాపుడు కోక చిరిగి పీలికలైంది. లభస యింకా ఎక్కువైంది. వాళ్లు కొట్టుకుంటున్నారు. వీరయ్య చిరిగిన చీర వంక నిశ్చేష్ఠుడై చూస్తున్నాడు.
చెన్నమ్మ కలలకూ, ఆశలకూ, ప్రేమకూ, గర్వానికీ, ఆనందానికీ నిలయమైన దాపుడు కోకను, చెన్నమ్మ గుండెకు ప్రతిరూపమైన యెర్ర కోకను వాళ్లది కాని చెన్నమ్మకోకను వాళ్లు నిర్దాక్షిణ్యంగా చించి పారవేశారు. చెన్నమ్మ దాపుడు కోక పీలికలైంది.
"నా  చెన్నమ్మ కిందపడిన పీలికల్ని పట్టుకొని రోదిస్తోంది. చంకలో పసివాడు అమ్మ వెక్కిళ్లకు శృతి పెడుతున్నాడు.

Tuesday, November 16, 2010

బ్రౌన్ ఆశయాలకు అంకితమవ్వాలి - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

 ప్రసంగిస్తున్న డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు
సీపీ బ్రౌన్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే విధంగా ఆయన జయంతి రోజున అంకితమవ్వాలని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో యోగి వేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి అధ్యక్షతన సీపీ బ్రౌన్ 212 జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కేతు విశ్వనాథరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రౌన్ 1992లో కలెక్టర్ అసిస్టెంట్‌గా ఉంటూ కడపలోని కరువు, సాంస్కృతిక స్థితిగతులను వివరిస్తూ లండన్‌కు లేఖలు రాశారన్నారు.
 యోగి వేమన యూనివర్శిటీ వీసీ అర్జుల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బ్రౌన్ తెలుగుభాష, తెలుగుజాతికి ఎనలేని సేవ చేసిన మహానీయుడని కొనియాడారు. వైవీయూలో పరిశోధనలకు అనుగుణంగా మరో బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని సిటీ క్యాంపస్‌గా, యూనివర్శిటీలో ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రాన్ని యూనివర్శిటీ క్యాంపస్‌గా ఉంచుతామన్నారు. యూనివర్శిటీ పరిశోధన కేంద్రంలో తెలుగు, హిస్టరీ, లలితకళల విభాగం, జర్నలిజం అనుసంధానం అవుతాయని తెలిపారు. సీపీ బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో మ్యూజియంను ఏర్పాటు చేసి అరుదైన పుస్తకాలు ఉంచుతామన్నారు. జిల్లా చరిత్ర, సాంస్కృతిక, సాహితీ, రాజకీయ చరిత్రలను తరతరాలకు తెలియజేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
 జానమద్ది హనుమచ్ఛాస్తి మాట్లాడుతూ సీపీ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో సంగ్రహ నివేదికను రిజిస్ట్రార్, పాలక మండల సభ్యుడు, ఆచార్య సి.శివరామిరెడ్డి సమర్పించారు. అనుసంధానకర్తగా వైవీయూ రీసెర్చి అసిస్టెంట్ కట్టా నరసింహులు వ్యవహరించారు. సీపీ బ్రౌన్ గీతాన్ని వై.మధుసూదన్ ఆలపించారు. బ్రౌన్ సైకత ముఖ చిత్రాన్ని ముద్దనూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, ఉపాధ్యాయుడు జార్జిలు తీసుకురాగా, సభలో ఆవిష్కరించారు. డాక్టర్ కృష్ణారెడ్డి తమ్ముని కుమారుడు సునీల్‌కుమార్‌రెడ్డి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్ర్తిని సన్మానించి రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందించారు. వేమన నీతి - లోకరీతి అనే పేరుతో వేమన పద్యాలు ఉన్న ఆడియో సీడీలను చిలకలూరిపేటకు చెందిన ఎస్ మహేష్ సభికులకు బహూకరించారు. వేమన సాహిత్యంతోపాటు పద్యాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు.
లోపాలు చూపేవాడే సద్విమర్శకుడు
మంచి విమర్శకుడైనవాడు భజనపరుడు కాదు.. వస్తు విశ్లేషణ కర్త కాదు.. లక్ష్యాన్ని పరిచయం చేసేవాడు, లోపాలను చూపేవాడే సద్విమర్శకుడు అని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. బ్రౌన్ జయంతి ఉత్సవాలలో భాగంగా జానమద్ది హనుమచ్ఛాస్ర్తి ఆవిష్కరించిన మన నవలలు-మన కథానికలు అనే పుస్తకాన్ని ఆయన సమీక్షించారు. కథా రచయిత ఆచార్య రాచపాలెం రామచంద్రారెడ్డి 13 నవలలను పరిచయం చేశారన్నారు. ఆయన ఆధునిక సాహిత్య విమర్శకుల్లో నిష్ణాతుడని కొనియాడారు. వైవీయూ వీసీ అర్జుల రామచంద్రారెడ్డి సతీమణి వరలక్షుమ్మ ఈ పుస్తకాన్ని స్వీకరించారు. తెలుగుభాష కోసం జీవితం సమర్పించిన బ్రౌన్ అనే పుస్తకాన్ని శశిశ్రీ రాయగా, రిజిస్ట్రార్ శివరామిరెడ్డి ఆవిష్కరించారు.
 భాషా పరిశోధన వ్యవహార కర్తగా ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో భాషా పరిశోధన వ్యవహారకర్తగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని నియమించినట్లు యోగి వేమన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అర్జుల రామచంద్రారెడ్డి తెలిపారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో బుధవారం నిర్వహించిన సాహితీ కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. భాషా పరిశోధనలు అంతంత మాత్రంగానే సాగుతున్నందున భాషపై మంచి పట్టు ఉన్న ప్రసిద్ధ కథకుడు, విమర్శకుడు అయిన కేతు విశ్వనాథరెడ్డిని వ్యవహార కర్తగా నియమిస్తూ యూనివర్శిటీ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.
 ఆయన నియామకంతో భాషా పరిశోధనలు ఆశాజనకంగా ఉంటాయని కమిటీ భావించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ భాషా పరిశోధనకు వైస్ ఛాన్సలర్ రామచంద్రారెడ్డి, సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్ర్తి సలహాలతో అవిరళ కృషి చేస్తానన్నారు. బ్రౌన్ చరిత్ర, నిర్మాణం, నిఘంటువు, చంధస్సు, వ్యాకరణం, భాషకు చేసిన కృషితోపాటు జిల్లా వస్తు చరిత్ర, అదనపు చరిత్ర, ముస్లిం రచనలు ఆనాటి రచనల ఆధారంగా సమగ్ర విషయాన్ని సేకరించి పరిశోధనలు చేసి తెలుగుభాషకు గుర్తింపు తెస్తానన్నారు. చరిత్ర, లలిత కళలు, జర్నలిజం ఆధారంగా, రాజకీయ, సాంస్కృతిక పరంగా జిల్లా సమగ్ర చరిత్ర నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

Wednesday, March 10, 2010

రెండూ మన:ప్రపంచాలు.. కేతు రెండు నవలలు

“…మధ్య తరగతిలో పుట్టి రచయిత జీవితవైరుధ్యాలను అర్థం చేసుకొని వొక స్పష్టమైన సామాజిక అవగాహనను యేర్పరచుకోవడం చాలాకష్టమే, వొకవేళ జీవిత వైరుధ్యాలు అర్థమైనా, సామాజిక అవగాహన యేర్పడినా జీవితాన్ని వాస్తవంగా, శిల్పసంపన్నంగా, హృదయ సంస్కార ప్రేరకంగా చిత్రించడం మరొక పెద్దచిక్కు సృజనాత్మక శక్తీ, విమర్శనా దృష్టీ దీనికి కావాలి. వీటికి తోడు శాస్త్రీయ దృక్పథమూ, చిత్తశుద్ధీ వుంటేనే తప్ప వాస్తవికతావాద సాహిత్య సృష్టి చేయడం అసాధ్యం”.
-కేతు విశ్వనాథరెడ్డి (‘జప్తు’ కథాసంపుటికి ముందుమాట-1974)
అది కథ కావచ్చు, నవల కావచ్చు మధ్య తరగతి నేపథ్యం నుంచి ఎదిగొచ్చిన రచయితగా సృజనాత్మక సాహిత్య రచనలో తానెదుర్కొన్న సవాళ్ళ గురించి, వాటినుంచి బయటపడడానికి తాను సమకూర్చుకొన్న పరికరాల గురించే కేతువిశ్వనాథరెడ్డి చాలా స్పష్టంగానే పేర్కొన్నారు. స్వీయానుభవ ప్రపంచానికి బయటనున్న జీవితాన్ని వాస్తవికతవాద సాహిత్యంగా మలచడంలో యే రచయిత అయినా యెదుర్కోనే యిబ్బందే యిది దాన్ని అధిగమించగల ప్రాపంచిక దృక్పథం కలిగివుండడం వల్లనే విశ్వనాథరెడ్డి సమకాలీన రచయితల్లో అగ్రగామిగా నిలబడగలిగారు.
కథారచయితగా మొదలై, కథకుడిగానే ప్రస్థానం కొనసాగిస్తూ రాయలసీమ ప్రాతినిధ్య రచయితగా కీర్తిగడించిన విశ్వనాథరెడ్డి రచించిన అరుదైన నవలలలు -వేర్లు, భోధి. ఈ రెండు నవలలు రెండు భిన్న ప్రపంచాలకు చెందినవి. జీవితానికి చెందిన తాత్త్వికతని రెండు వేర్వేరు కోణాల్లోంచి ఆవిష్కరించినవి. ఉన్నత విద్యనభ్యసించి విశ్వవిద్యాలయం నుండి బయటపడ్డ భిన్న సామాజిక వర్గాలకు చెందిన యిద్దరు నిరుద్యోగ యువకుల వుద్వేగభరితమైన సంక్లిష్ట జీవితాన్ని, మానసిక సంఘర్షణని విమర్శనాత్మకంగా కళ్ళకు కట్టిన యీ రెండు నవలలూ ఆయన కథల నీడలో వెలుగులోకి రాలేదంటే తప్పుకాదేమో!
జీవిత వైరుధ్యాల్ని అర్థం చేసుకోగల సామాజిక అవగాహన, శాస్త్రీయ దృక్ఫథం, చిత్తశుద్ధి వొక నిబద్ధ రచయితకుండాల్సిన అర్హతలన్నీ కేతులో నిండుగా వున్నాయనడానికి యీ రెండు నవలలూ నిలువెత్తు వుదాహరణలే అయినప్పటికీ ‘వేర్లు’ నవల చదువుతున్నంతసేపూ ప్రత్యక్ష 80లోనూ అవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ‘వేర్లు’ రాసేనాటికి (1978) విశ్వనాథరెడ్డి కథకుడిగా తెలుగు సాహిత్యంలో యింకా తనదైన ముద్రని వేసే ప్రయత్నంలోనే వున్నారు. ఆయనకి పేరుతెచ్చిన ‘నమ్ముకొన్ననేల’, ‘కూలిన బురుజు’ లాంటి కథలు ఆ తర్వాతే వచ్చాయి. ‘వెనకా ముందూ’ లాంటి కథల్లో ఆయన చేసిన నిష్పాక్షికమైన విలువల ప్రకటనలు ఆయనలోని నిర్భీతి తత్వాన్ని తెలియజేసాయి. ‘మార్పు’, ‘సానుభూతి’ కథల ద్వారా రచయితగా తానెటు నిలబడదల్చుకొన్నారో, తన సాహిత్య దృక్పథం యేమిటో నిర్ధ్వంద్వంగా స్పష్టం చేశారు. అయినప్పటికీ వొక దళిత యువకుడి జీవిత సంఘర్షణని నవలకు యితివృత్తంగా యెన్నుకొని తనది కాని ప్రపంచాన్ని, తనవి కాని అనుభవాల్ని రాయడానికి పూనుకోవడం వొకవిధంగా సాహసమే. అదేకాలంలో కేశవరెడ్డి ‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’ (1977) దళిత జీవితాన్ని చిత్రించినప్పుటికీ ఆ నవల సంఘటన ప్రధానంగా సాగింది. విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ సంఘర్షణ ప్రధానంగా రూపొందింది.
ఈ నవలలో నాయకుడు వెంకట్రాముడు ఆంత్రోపాలజిలో పి.జి. చేసిన వొక మాదిగ యువకుడు. తాను చదివిన చదువువల్ల అతడు తన కులంలో యిమడలేదు.సామాజిక ఆర్థిక అసమానతల చట్రంలో స్వశక్తితో యెదిగే ప్రయత్నంలోనలిగిపోయి, జీవితానికి సంబంధించిన అన్ని రకాల అభద్రతనీ అనుభవిస్తాడు. తనకు తెలియకుండానే పరాయీకరణకు గురై దాన్నుంచి బయటపడే దారులు కనపడక జీవితాన్ని ఓడిపోతాడు. చివరకు యిదంతా యిలా ఎందుకు జరుగుతోందని అతనిలో ‘సత్యశోధన’ మొదలవుతుంది. స్థూలంగా ఇదీ వేర్లు నవలలోని కథ.
తెలుగు నేలమీద దళితుని పరాయీకరణను- అందులోని హింసనీ అమానవీయతని యింత లోతుగా చిత్రించిన నవల అంతకుముందు రాలేదు. తాను చదువుకొన్న చదువులవల్ల తాను తన యింట్లోనే పరాయి వాణ్ణయిపోయనన్న స్పృహ వెంకట్రాముడికి వుంది. సొంత మనుషులకు అతను మానసికంగా, సాంస్కృతికంగా దూరమైపోయాడు. శరీరశ్రమలో సైతం పాలుపంచుకోలేని నిర్వ్యాపారతకు గురయ్యాడు. తండ్రి మాదిరి కుల వృత్తి చెయ్యలేడు. అన్న మాదిరి ముగ్గురాళ్ళగని పనిలోకి వెళ్ళలేడు. చదువు అబ్బని ఇద్దరు తమ్ముళ్ళ మాదిరి రైతుల యిళ్ళల్లో పేడకళ్ళు తియ్యలేడు. గంజు యెత్తలేడు, గొడ్డుకాయలేడు.తల్లి చెల్లెళ్ళ మాదిరి ముగ్గురాళ్ళ గ్రేడింగ్‌కు తాను వెళ్ళలేడు, మాదిగవాడ, అక్కడి మనుషుల జీవితం, సంస్కృతి అతనికి భరింపరానివీ, జగుప్స కల్గించేవి అయ్యాయి. ‘తనకూ తన వాళ్ళకూ మధ్యయేదో అంతరం’ అతని అనుభవానికి వస్తుంది గానీ ఆ సంబంధాలను నిలుపుకొనే ప్రయత్నం అతను చెయ్యడు. హింసాపూరితమైన యీ పరాయీకరణకి మూలాలు ఎక్కడ వున్నాయో అతనికి తెలియదు.తన జాతిగురించి, సమూహం నుంచి తనను తాను స్వయంగా వెలివేసుకుంటాడు. తోటి మనుషుల్లో కలవలేని రోజుల్లోనే మొదలైంది. కులం పేర్న యెదురయ్యే అవహేళనల్ని, అవమానాల్ని తప్పించుకొనేందుకు అతను పుస్తకాల్లో తల దాచుకొన్నాడు. అవి కూడా క్లాసు పుస్తకాలే. మానవశాస్త్రంలో మాస్టర్స్‌ చేసినా అతనికి అంబేద్కర్‌ జీవిత చరిత్ర వంటి పుస్తకాల వునికి కూడా తెలియదు. కులాల సమాజం అతణ్ణి లోలోపలికి ముడుచుకుపోయేలా చేసింది. జీవితాన్ని జయించాలనే తపనలో అతను జీవితాన్నే కోల్పోయాడు.
మీదిపెంట్ల గ్రామం, జిల్లా కేంద్రం కడప, రాజధాని హైదరాబాదు-మూడు కథాస్థలాల్లోనూ వెంకట్రాముడు కులపరంగా ఎదుర్కొన్న న్యూనత, దాన్ని జయించడానికి పడిన సంఘర్షణ భయంకరమైనవి. చచ్చిన గొడ్డు మాంసం తినేవాళ్లు, మడత నాలికగాళ్ళు, గవర్నమెంటు దత్తపుత్రులు, స్కాలర్‌షిప్‌లతో వొళ్ళు బలిసి వాళ్ళు వంటి ముద్రలతో చిన్నప్పటినుంచి -ఊళ్ళో, స్కూల్లో, హాస్టల్లో, యూనివర్సిటిలో అనుభవించిన కులహైన్యం, అవమానాలు అతనిలో క్రోధానికి కారణమయ్యాయి. సొంతపేర్లు సైతం లేని అస్తిత్వవేదనలో అతను రగిలిపోయాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే ‘ఆ రకమైన రొంపి అనుభవానికొస్తే గానీ, అందులోని యాతన అర్థంకాదు…’ తిరగబడలేని తమ తరతరాల కుల రక్తం మీద, కుల మనస్తత్వం మీద, గుండెను దహించే ఆత్మన్యూనతాభావం మీద అసహ్యం’ కలిగింది. గ్రూప్‌ వన్‌ ద్వారా ఆర్‌డివో అయి తమని సాంఘికంగా అణచివేసే వాళ్ళ మీద అధిపత్యం సాధించాలనుకొంటాడు.
ఉద్యోగం వేట కూడా ఎండమావులవెంట పరుగేనని చివరికి గ్రహిస్తాడు.తన అభివృద్ధికి అడ్డం తగిలేది రాజకీయంగా, సామాజికంగా ఎదిగిన తన కులంలోని క్రీమీలేయర్‌లో వున్న ఎమ్మెల్యే పెంచలయ్య. డిఆర్వో ఓబయ్య లాంటి స్వార్థ శక్తులేనని గ్రహించి విస్తుపోతాడు. వాళ్ళందరికీ ‘కులనిర్మూలన సమితి’ వంటి సంస్థలు మాస్క్‌లుగా ఉపయోగపడతాయనే అవగాన కూడ కలుగుతుంది. వాసు వంటి అగ్రకులానికి చెందిన సానుభూతిపరుల చేతుల్లోనూ, చలపతి వంటి రాజకీయ నాయకుల కనుసన్నల్లోనూ నడిచే ‘కుల నిర్మూలన సమితి’ని దగ్గరగా చూశాకా దాన్ని నిర్వహించే మనుషుల స్వార్థం, వాళ్ళ ఆలోచనల్లోని డొల్లతనం మాత్రమే కాదు. ఆ సంఘం పరిమితిలు కూడా అతనికి తెలుస్తాయి. కానీ వాస్తవాల్ని స్వీకరించే చైతన్యం అతనికి యేర్పడలేదు. క్లాస్‌మేట్‌ చంద్రవతి చూపిన కాలక్షేపం అభిమానాన్ని ప్రేమ అనుకొని కులాంతర వివాహం ద్వారా కులహీనతని అధిగమించవచ్చనే భ్రమలో వుంటాడు.
పరాయీకరణని జయించే ప్రయత్నంలో వెంకట్రాముడిలాండి వాళ్ళు మరింత పరాయీకరణలో కూరుకుపోవడాన్ని ఆయాసందర్భాల్లో కేతు అద్భుతంగా పట్టుకోగలిగారు.
వెంకట్రాముడికి దిశానిర్దేశం చేసే సామాజిక ఉద్యమాలు ఆ రోజుల్లో రాయలసీమలో లేవు. ఆదేకాలంలో ఉత్తర తెలంగాణ పల్లెలు రైతుకూలి పోరాటాలతో అట్టుడికి పోతున్నాయి. ఆ కల్లోల దశాబ్దంలోనే అల్లం రాజయ్య వెలుగులోకివచ్చారు. వెంకట్రాముడి లాంటియువకులు ఉద్యమాల్లో మమేకమయ్యారు. రాజయ్య కొలిమంటుకొన్నది (78-79) నవల నిర్థిష్ట సమాజంలో చోటు చేసుకొన్న సామూహిక కల్లోలాన్ని రికార్డు చేస్తే, విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ వ్యక్తుల మానసిక సంఘర్షణకు అద్ధం పట్టింది.
ముప్పై సంవత్సరాలకు వూర్వం – దళిత అస్తిత్వ స్పృహ వంటి మాటలు సైతం లేని రోజుల్లో దళితాంతరంగ కల్లోలాన్ని, మానసిక సంఘర్షణని, అస్తిత్వ వేదనని అద్భుతంగా ఆవిష్కరించగలగడానికి కేతు యీ నవలని కేవలం దళిత సానుభూతితో మాత్రమే రాయలేదు. అనితరసాధ్యమైన వొక సహానుభూతితో రచయితగా ఆయన దళిత హృదయానికి దగ్గర కాగలిగారు. దళిత సంస్కృతిని కడుపులో తిప్పే కసరు వాసనల్తో సహా చూడగలిగారు.
ఆ సహానుభూతి నుంచే సంక్షేమ హాస్టళ్ళని పట్టణాల్లో నగరాల్లో వెలసిన వెలివాడలుగా అర్థం చేసుకోగలిగారు. అక్కడివిద్యార్థులు ఎదుర్కొనే దుర్భర, దయనీయ పరిస్థితుల్ని ఎత్తి చూపారు. 1978లో ‘వేర్లు’ నవలలో కేతు వర్ణించిన హాస్టళ్ల పరిస్థితికి, 2005లో వచ్చిన కనుంపల్లి రాజారాం ‘ఎదురగ్గి’ నవలలో పరిస్థితికి తేడా యేంలేదు. అధికార మార్పిళ్ళు ఎన్ని జరిగినా సంక్షేమంలో అవినీతి మారలేదు. దళితులపై అణచివేత రాజకీయలు మారలేదు.వాటిని ఎదుర్కొని నిలవరించే ‘వీరదాసు’లాంటి వ్యక్తుల చైతన్యమే తర్వాతి కాలంలో రాయలసీమలో సైతం సామూహిక ఉద్యమంగా రూపొందింది. సంక్షేమ హాస్టళ్ళు విప్లవ విద్యార్థి రాజకీయాలకు పురిటి గదులయ్యాయి, వాటి బీజాల్ని కేతు నికార్సయిన వాస్తవికతావాదిగా ‘వేర్లు’ లో దర్శించగలిగారు.
‘దండోరా’ వంటి ఉద్యమాల్లో సైతం నిర్లక్ష్యానికి గురయిన మాదిగ సాంస్కృతిక కోణాల్ని కేతు విశ్వనాథరెడ్డి ‘వేర్లు’ నవల ద్వారా అపూర్వంగా అవిష్కరించారు. అందులో భాగంగానే వెంకట్రాముడి తండ్రి సుబ్బడు చెప్పిన ఆది జాంబవుడి కథ ఈ నవలలో వొక ప్రయోజనాన్ని వుద్దేశించి చోటుచేసుకొంది. మాలమాదిగల సాంస్కృతిక మూలాల్ని తెలిపే యీ సమాంతర పురాణం దళితలు ఆత్మగౌరవ ప్రకటనకు మరో రూపం. ‘మనంలేంది రైతులు బతకలేరు, మనంలేంది దేవర్లు లేవు. అందుకనే మన గొప్ప మనది’ అన్న సుబ్బడి ముక్తాయింపులో యిది వ్యక్తమౌతుంది. ‘సరే, మరి -వాళ్ళెందుకు మనల్ని హీనంగా చూస్తారు?’ అన్న వెంకట్రాముడి ప్రశ్న తరతరాలుగా దళితులపై అమలయ్యే అణచివేతకు మూలాల్ని అన్వేషిస్తుంది. ఈ అన్వేషణే ‘వేర్లు’ నవల నిండా పరచుకొని వుంది. మార్క్సు చెప్పిన శ్రమ పరాయికరణ సూత్రం యిక్కడ సమాధానం అవుతుంది. దాని తెలుసుకొనే దిశగానే వెంకట్రాముడి ‘సత్యశోధన’ సాగుతుంది. ఆ సూత్రాన్ని జీవితానికి అన్వయించుకోగలిగినప్పుడు మాత్రమే ‘హరిజనుల జీవితం ఎన్ని రూల్సుకు లోబడి వుంది’ అని అతన్లో పుట్టిన మరో ప్రశ్నకు కూడా సమాధానం లభిస్తుంది. అప్పుడు మాత్రమే ఊళ్ళో రెడ్ల కుటుంబాల అధిపత్యపోరులో, ముఠా రాజకీయాల్లో కింది కులాలకు చెందిన మాలోళ్ళు వడ్లోళ్ళు, గొల్లోళ్ళు పావులుగా మారి మట్టికొట్టుకుపోయిన వైనాన్ని సైతం అతను అర్థం చేసుకోగలుగుతాడు. అప్పుడు మాత్రమే రోషిరెడ్డి చేతుల్లో మోసపోయిన దేవదానం చెల్లెలు మేరిపట్ల సానుభూతి చూపగలుగుతాడు. అప్పుడు మాత్రమే తను పుట్టి పెరిగిన సమాజంలో, వాళ్ళ కష్టాల్లో తను భాగం కాగలడు. వాళ్ళ గొడ్డు జీవితం పట్ల అనుకంప చూపగలడు. చదువుతో, చదువు పెంచిన వేరు సంస్కారంతో, స్కాలర్‌షిప్‌లతో, అవి పెంచిన దయ్యాల మర్రిచెట్టు ఊడల్లాంటి భ్రమలతో, స్వార్థంతో, దురాశతో తను కోల్పోయిన మానవత్వాన్ని తిరిగి నిలబెట్టుకోగలడు. అప్పుడు మాత్రమే తన చుట్టూ వున్న జీవితానికీ, తను కొత్తగా యేర్పరచుకొన్న సంస్కారానికి పునాదులేవో ఆలోచించుకోగలుగుతాడు.
ప్రస్తుతం అమల్లోవున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ చట్రాలు వెంకట్రాముడి లాంటి వాళ్ళు తమ వాళ్ళనుండి దూరమవడానికీ దోహదం చేస్తాయి. ఆ చట్రాన్ని బద్దలు చేయగల వీరదాసుల్ని నవల్లో పాత్రలుగా చేయడం ద్వారా కేతు భవిష్యత్తుని చూడగలిగారు. దళితోద్యమాలు వీరదాసు -వెంకట్రాముల కలయికతోనే బలపడతాయి. అయితే ఆ వెంకటేశు, పెదవోబులు, మునిమామ, సుబ్బడు లాంటి వాడదళితుల్ని వదిలి యింకా ఓబయ్య, పెంచలయ్య, పుల్లమ్మ, చలపతుల చుట్టూనే తిరుగుతున్నాయి కదా అనే ఆవేదన సైతం నవలని యివాళ్టి పరిస్థితులకు అన్వయించుకొన్నపుడు కలగకమానదు.
ఆ విధంగా మార్క్సిజం వెలుగులో దళితుల పరాయికరణని చిత్రించిన ‘వేర్లు’ యివాళ్టికి కూడా ప్రాసంగికంగానే వుంది. మాదిగ ఆత్మగౌరవ పోరాట స్పూర్తితో నాగప్పగారి సుందర్రాజు బోడెద్దుకత (మాదిగోడుకతలు)కి రెండు దశాబ్దాల వూర్వమే మాదిగ వాడల్లోకి వెళ్ళి గొడ్డు మాంసం కోతని కేతు వర్ణించగలిగారు. మాలపిల్ల మాదిగవాడల్లో రెండు కులాలకు వేర్వేరు మంచి నీళ్ళ బావులుండే విషయాన్ని ప్రస్తావించడమే కాదు. దానిలోని అమానుషతని ప్రశ్నించారు. వీటన్నిటినీ సాహిత్యీకరించగలగడానికి కారణం అయనకున్న ప్రాపంచిక దృక్పథమే- ఆ దృక్పథం ఆయనకు మార్క్సిజం తత్త్వశాస్త్రంగా ఆధ్యయనం చేయడంవలనే కలిగింది. రారాలాంటి వారి సాహచర్యం అందుకు తోడ్పడిన మాట నిజమే కానీ సృజనాత్మక శక్తికి విమర్శనాదృష్టిని, పరిశోధనాభినివేశాన్ని జోడించడం ద్వారానే అది సాధ్యమైంది. రచయితగా తన చుట్టూ వున్న మానవ సమాజంలోని చలనాన్ని పట్టుకోగల శాస్త్రీయ దృక్పథం, సైద్దాంతిక అవగాహన కేతులో మెండుగా వుండటంవల్లనే ‘వేర్లు’ నవల అచ్చమైన శిల్పసంపన్నమైన దళితనవలగా రూపొందింది.
విశ్వనాథరెడ్డి రెండోనవల ‘బోధి’ 1984లో వెలువడింది కథాకాలం -1962కి కొంచెం అటూఇటూ. బోధిలో ప్రధాన పాత్ర చెన్నకేశవ – మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందినవాడు. జీవితంలో నైతిక విలువలగురించి, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల్లో వెల్లివిరియాల్సిన స్వచ్ఛమైన ప్రేమ గురించి చెన్నకేశవ మనసులో కలిగే ఆలోచనలు, అతని జీవిత ఆచరణ నవలకు ప్రధాన వస్తువు. వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎం.ఎ. ఎకనామిక్స్‌ చేసి హైదరాబాదులో చోటమోటా జర్నలిస్టుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టిన చెన్నకేశవ మిత్రులు శ్రీపతి అజీజ్‌ల దృష్టిలో కుటుంబరావుని చదివి చెడిపోయినవాడు. వాళ్ళిద్దరూ చలాన్ని అడ్డం పెట్టుకొన్న స్వేచ్ఛా జీవులు. చెన్నకేశవకు చలంపట్ల, ప్రేమ పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి.
‘ప్రేమ పరస్పర సాహచర్యం-ఇద్దరి జీవితాన్ని వెలిగించేది – ఇద్దరి సంస్కారాన్ని పెంచేదీ’ అనే చెన్నకేశవకు తండ్రి వివాహేతర సంబంధాలపట్ల అసహ్యం వుంది. తండ్రి ప్రవర్తనలవల్ల యింట్లో జరిగే ఘర్షణలను చూసి అటువంటి దాంపత్య జీవితం తనకు వద్దని అనుకొంటాడు.
నిజమైన ప్రేమ లేకుండా స్త్రీని తాకకూడదు – అని నిర్దారణకు వస్తాడు. ‘ఒక మగవాడు ఇద్దర్నో ముగ్గుర్నో ప్రేమిస్తే లోకం ఏమీ అనుకోనప్పుడు ఒక స్త్రీ ఇద్దర్నో ముగ్గుర్నో ప్రేమించకూడదా’ అన్న క్లాస్‌మేట్‌ రాణి గాలివాటం జీవితం పట్ల సానుభూతి కల్గివుంటాడు. స్త్రీ పురుషుల విశృంఖల శృంగారాన్ని అంగీకరించాడు. అన్ని విలువల్ని వదిలి అక్రమ మార్గాల్లో పైకెదిగే మిత్రుల్ని ద్వేషించే వాళ్ళని వదులుకొంటాడు. వాళ్ళతో నింఫోమానియక్‌ అని నిందకు గురైన రాణి స్నేహంలో మంచినే చూశాడు. రాణి పరిచయం చేసిన ప్రసూనకు మానసికంగా దగ్గరయి తాను నిర్వచించుకొన్న నిజమైన ప్రేమను ఆచరణలో పెడతాడు.
ఈ నవల ఒక విధంగా విశ్వనాథరెడ్డి స్వీయానుభవాల్లోంచి పుట్టినట్లుంటుంది. చెన్నకేశవలోని ఆదర్శభావాలు, కమ్యూనిస్టు భావజాలంవైపు ఆకర్షణ, జర్నలిస్టు జీవితం, తర్వాత ఆధ్యాపకవృత్తి యివన్ని ఆయన తన జీవితం నుంచే తీసుకొన్నారు. నవలలో చర్చించిన విషయాల్లో చలానికి కుటుంబరావుతో చెక్‌ చెప్పినట్టు తోస్తుంది. చలం 1972 ఫిబ్రవరి 5న సంభవించే జగత్‌ ప్రళయం నుంచి తప్పించుకోడానికి శ్రీశ్రీని అరుణాచలం రమ్మని చెప్పిన ఉదంతాన్ని హేళన చెయ్యడం రచయితలోని హైతిక దృష్టికి వొక ఉదాహణ మాత్రమే. ఏక కాలంలో స్త్రీ పురుషుల మధ్య బహుసంబంధాల గురించి మిత్రులు శ్రీపతి, అజీజ్‌లతో, ప్రసూనతో చెసిన చర్చలు కూడా హేతుబద్దంగానే సాగినప్పటికీ -అవి ఉద్వేగ ప్రధానంగా కూడా వుంటాయి. ఆ ఉద్వేగ గుణమే అతణ్ని ప్రసూనకు మరింత దగ్గర చేస్తుంది.
రాణి స్వేచ్చావర్తనని సింహం నోట్లో తలపెట్టే సర్కస్‌ ఫీట్‌గా పేర్కొన్నప్పటికీ ఆమె మరణం చెన్నకేశవని ఎంతో కదలిస్తుంది. చలం స్త్రీలు కూడా ఎక్కడా సుఖపడలేదు. – పైగా చివరికి శిక్షలనుభవించారని – విమర్శకుల్లో ఒక అభిప్రాయం వుంది. విశ్వనాథరెడ్డి రాణికి చావుని విధించకుండా వుంటే బాగుండేది. చెన్నకేశవ కూడా సంతోషించేవాడు. ఒక మంచి విలువని గెలిపించడానికి – చెడ్డ విలువని ఓడించాలి గానీ – ఆ వ్యక్తిని కాదు.
ఈ నవల పేరుని రచయిత వాచ్యం చేస్తారు. చెన్నకేశవ తన ఊరికి ఎగువ తోటలవైపు వెళ్ళే దారిపక్క రావి చెట్టు దగ్గర క్షణికమైన కామోద్రేకాలకు- శాశ్వత ప్రేమకు సంబంధించిన సంఘర్ణణకు లోనవుతాడు. యౌవనోద్వేగంలో వొకబలమైన ఆకర్షణలో రాధా అనే అమ్మాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపానికి గురువుతాడు. దరిమిలా ప్రేమ విషయమై స్వచ్ఛత గురించి కొన్ని తీర్మానాలు చేసుకొంటాడు. బోధివృక్షం జ్ఞానోదయానికి పాదయింది. ఆ జ్జానం చెన్నకేశవ ఆచరణలో ప్రతిఫలిస్తూ వుంటుంది.తను ప్రేమించిన ప్రసూనతో ఆ జ్ఞానాన్ని ఎంతో నిజాయితీ పంచుకొంటాడు.
కథనాయకుడు దృష్ట్యా ‘బోధి’ మోదాంతనవల. ‘వేర్లు’ వెంకట్రాముడి ఓటమి విషాదం కలిగిస్తుంది గానీ – ఆ తర్వాతి అతని ఆచరణ గురించి పాఠకుడిలో ఆలోచన మొదలౌతుంది.
నిజానికి చెన్నకేశవ వెంకట్రాముల జీవితానికి, ఆలోచనలకు చాలా తేడా వుంది. వెంకట్రాముడిది అస్తిత్వ సమస్య. చెన్నాకేశవది ఆదర్శాల, విలువల సమస్య. కరువుల రాయలసీమలోనే పుట్టినప్పటికీ చెన్నకేశవకు కులం, పొలం బలం వున్నాయి. వెంకట్రాముడు కూడా యవ్వన సహజమైన ప్రేమలో కూరుకుపోయినప్పటీ కులం కారణంగా అది అపహాస్యానికి గురవుతుంది. మాదిగవాడలో చెన్నకేశవలాంటి వాళ్లు కోరుకునే లేదా వెంకట్రాముడు కొత్తగా నేర్చుకొన్న సంస్కారంతో ఆశించే ప్రేమలకూ, కన్నీళ్లకూ, బాధపడడాలకూ తీరిక వుండదు. అది వెంకట్రాముడికి స్వయంగా అనుభవంలోకి వచ్చిన కఠోర సత్యం. ఇద్దరూ సమకాలీనులే అయినప్పటికీ వారి మన: ప్రపంచాల్లో కదిలే ఆలోచనలు వేరు. ఒకే సమాజంలోని రెండు ప్రపంచాల జీవన సంక్లిష్ఠతని రెండు నవలలు పాఠకుల ముందుంచ గలిగాయి.
రూపం దృష్ట్యా రెండు నవలలూ చిన్నవే అయినప్పటికీ విషయ విస్తృతిపరంగానూ పాత్ర చిత్రణ ఇతివృత్త నిర్వహణరీత్య రెండూ నవలా లక్షణాల్ని కలిగివున్నాయి. ప్రచురణ క్రమంలో బోధి 1984లో వెలువడినప్పటికీ రచనా పద్దతి పరిణతి చూస్తే ‘వేర్లు. వెనకసిరి నవలగా తోస్తుంది. నిజానికి వస్తురీత్యా. 70ల నాటికైనా ‘బోధి’లో అంత వైవిధ్యం కనిపించదు. వేర్లు నవలలో లాగా సంఘర్షణ కూడా లేదు. పాత్రల మధ్య వైరుధ్యాలు చిత్రితమైనప్పుటీకీ అవి సంఘటనలకు దారితీయవు. ఇది బోదిలో కనపించే ప్రధానమైన లోటే అనిపించినప్పటికీ జీవితంపట్ల చెన్నకేశవ దృక్పథాలు, నిజాయితీ ముచ్చటగొలుపుతాయి. చెన్నకేశవలో రచయితే అడుగుడుగునా కనపించడంతో కేతు వ్యక్తిత్వం కూడా మనకు యీ నవలల్లో రూపుకడుతుంది. ఇది యీ నవల ప్రత్యేకత.
స్వీయ జీవినానుభవాలను సృజనాత్మకంగా మలచడంలో రచయిత ఎదుర్కొనే వొక రకమైన యిబ్బంది కూడా కేతు బోధి రాసినప్పుడు అనుభవించినట్లు కనిపిస్తుంది. ఎంతో మెలకువతో తాటస్థ్యాన్ని పాటించిన్పటికీ రచయిత కంఠస్వరం చెన్నకేశవలో దొరికిపోతుంది.
రెండు నవలల్లో ప్రసక్తాను ప్రసక్తంగా రాయలసీమలో చోటు చేసుకొంటున్న ఉత్పత్తి సంబంధాల్లో వస్తున్న మార్పులు కూడా చిత్రితమయ్యాయి. అవే తర్వాతి కాలంలో కేతు కథలకు ప్రధాన వస్తువులయ్యాయి.
రచయితగా కేతు సాహిత్య సామాజిక నిబద్దతనీ, వ్యక్తిత్వాన్నీ అర్థం చేసుకోవడానికీ వేర్లు, బోధి నవలలు ఎంతగానో తోడ్పడుతాయి.
-ఎ.కె.ప్రభాకర్
-"ప్రాణహిత.ఆర్గ్ " సౌజన్యంతో..

Wednesday, January 20, 2010

వేమన సర్వస్వానికి వేమన విశ్వవిద్యాలయం వేదిక కావాలి- అచార్య కేతు విశ్వనాథరెడ్డి


ప్రజాకవి వేమనకు సంబంధించిన సకల సమాచారాన్నీ, సాహిత్యాన్నీ సేకరించి కడపలోని వేమన విశ్వవిద్యాలయంలో వేమన సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథా రచయిత, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. సి.పి.బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజాకవి, యోగి
వేమన జయంతుత్సవ సభలో ముఖ్య అతిధి గా ఆయన ప్రసంగిస్తూ జనరంజకమైన వేమన పద్యాలకు ప్రామాణిక ప్రతులను కూడా ప్రచురించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేమన 400 సంవత్సరాల కిందట వేమన ఎండగట్టిన సామజిక రుగ్మతలతొనే ఈనాటికీ బాధపడుతున్నందుకు మనమంతా సిగ్గుపడాల్సి వస్తోందని దాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో వేమన అంతటి వివాదాస్పద వ్యక్తిత్వం మరెవరిలోనూ కనిపించదని ఆయన అభిప్రాయ పడ్డారు. పండితుల నుంచీ పామరుల దాకా కులాలకూ, మతాలకూ అతీతంగా వేమన పద్యాలు జనం నోళ్ళలో నానుతూనే ఉండటం ఆయన పద్యాల విశిస్టతగా కేతు విశ్వనాథ రెడ్డి అభివర్ణించారు. పోతులూరి వీరబ్రహ్మంగారి శిష్యుడయిన సిద్దయ్య వేమన పద్యాలకు ప్రభావితుడై వేమన తాళ పత్రాలను రూపొందించిన విషయమై పరిశోధన సాగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య కక్ష్యలు సమసి పోవాలంటే శత్రువును క్షమించే గుణం ఉండాలన్న విషయాన్ని వెమన తన పద్యాల్లో చెప్పాడంటూ " చంప తగిన యట్టి శత్రువు" పద్యాన్ని ఉదహరించారు. సాహిత్య నేత్రం సంపాదకుడు, యోగి వెమన విశ్వవిద్యాలయం పాలకమండళి సభ్యుడు శశిశ్రీ మాట్లాడుతూ వేమన తన పద్యాల ద్వారా సూఫీ తత్వ విచారాన్ని వ్యక్త పరిచారని అభిప్రాయ పడ్డారు. ఈ కోణం పై పరిశోధకులు దృష్టి సారించాలనీ సూచించారు. వేమన విశ్వవిద్యాలయంలో వేమన పీఠాన్ని యేర్పాటు చెస్తానని గతంలో పనిచేసిన ఉప కులపతి ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి హామీ ఇచ్చి మాట నిలుపుకోలేక పోయారని, ఇప్పుడైనా వేమన పీఠం ఏర్పాటునకు కృషి జరగాల్సిన అవసరం ఉందని శశిశ్రీ పేర్కొన్నారు. వేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగం అధిపతి మూల మల్లికార్జున రెడ్డి ప్రసంగిస్తూ వేమనను అచల సిద్ధాంతిగా అభివర్ణించారు. 17 శతాబ్దంలో జీవించిన వేమన, వీరబ్రహ్మం లు ప్రజల్లో నెలకొన్న అజ్ఞానాంధకారాలను తొలగించడంలో తాత్విక భూమికను పోషించారని వివరించారు. వేమన, వీర బ్రహం ల రచనలలోని సారూప్యతను మల్లికార్జున రెడ్డి చక్కగా వివరించారు. వెమన విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలు ఎం.ఎం.వినోదిని ఉపన్యసిస్తూ రాజుల పడక గదుల చుట్టూ , స్త్రీల శరీర వంపుల మీదుగా తచ్చాడుతున్న తెలుగు సాహిత్యాం వేమన రాకతో ప్రగతి పథం పట్టిందని, జనం కడగండ్లనే వేమన తన పద్యాలకు కవితావస్తువులుగా చేసుకున్నారని వివరించారు. అప్పటిదాకా కుళ్ళి కంపుకొడూతున్న వ్యవస్థ కోసం వేమన మందు తీసుకు వచ్చాడని వినోదిని అన్నారు. గత దశాబ్దంలో ఊపందుకున్న దళిత, స్త్రీవాద ఉద్యమాలకు వేమన ఆనాడే బీజాలను వేశాడని ఆమె పేర్కొన్నారు. వైదిక బ్రాహ్మణత్వాన్ని ఎండగట్టిన శూద్రకవిగా వేమనను వినోదిని అభివర్ణించారు. వేమన విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వి.సి. ప్రభాకర రావు, బ్రౌన్ గ్రంధాలయ వ్యవస్తాపకుడు జానుమద్ది హనుమచ్చ్శాస్త్రి, బ్రౌన్ పరిశోదనా కేంద్రం సహాయ పరిశోధకులు విద్వాన్ కట్టా నరసిం హులు, రిజిస్ట్రార్ నారాయణ రెడ్డి, ప్రసంగించారు. ఈ సమావెశంలో సాహితీ ప్రముఖులు టక్కోలు మాచి రెడ్డి, అవధానం ఉమా మహేశ్వర శాస్త్రి, తవ్వా ఓబుల్ రెడ్డి, లింగమూర్తి, పార్వతి, గౌరీ శంకర్, మొగిలి చెండు సురేష్, జి. సాంబ శివా రెడ్డి, రాజా సాహేబ్, తదితరులు పాల్గొన్నారు.